విజయనగరాన్ని శ్రీకృష్ణ దేవరాయలు పాలిస్తున్న కాలంలో అనంతవర్మ అనే నమ్మకస్థుడిని కోశాధికారిగా నియమించాడు తిమ్మరుసు మహామంత్రి
అనంతవర్మకు ఒక్కగానొక్క కొడుకు రాజశేఖరుడు. అతడు సకాల విద్యల్లోనూ ముందుండేవాడు.
కొంత కాలానికి అనంతవర్మకు వృద్ధాప్యం ముంచుకు వచ్చి కాస్తంత చూపు మందగించింది. అప్పటికి రాజశేఖరుడు యుక్తవయస్కుడయ్యాడు. కానీ ఏ బాధ్యతలు పట్టకుండా తిరుగుతుండేవాడు. దానికి తోడు చెడు స్నేహాలు కూడా అలవాటయ్యాయి. అందుకోసం అతడు ఇంటి దొంగగా కూడా మారాడు.
ఒకనాటి రాత్రి అనంతవర్మ ఇంటికి ఇద్దరు వ్యాపారస్థులు వచ్చారు. వారు ఆ రాత్రికి ఆశ్రయం కోరారు. అనంతవర్మ అందుకు అంగీకరించి వారికి కావల్సిన ఏర్పాట్లు చూడమని రాజశేఖరుడికి పురమాయించాడు.
దగ్గరుండి ఆ ఇద్దరు వ్యాపారస్థులకు కావల్సిన అన్ని ఏర్పాట్లను చేసి వారిని విశ్రాంతి తీసుకోమని చెప్పి గది నుండి బయటకు వస్తుండగా వారిద్దరూ అతడిని వెనక్కు పిల్చి రెండు డబ్బు మూటలను ఇస్తూ "అయ్యా! ఈ రెండు మూటల్లో ఎంత ఉందో మేం లెక్కించలేదు. కనుక ఎవరి మూట మీద వారి పేరులు రాసాం. వీటిని భద్రపరచి తిరిగి ఉదయం ఇవ్వండి” అంటూ చెప్పారు. సరే! నంటూ ఆ రెండు మూటలు తీసుకు వచ్చి భోషాణంలో భద్రపరుస్తుండగా అతడికి దుర్బుద్ధి పుట్టింది.
రెండు మూటల్లో ఎంతుందో ఇచ్చినవారికే తెలియదు కదా! ఇందులో కొంత తగ్గితే మాత్రం ఎలా కనిపెట్టగలరు అనుకుని రెండు మూటలను విప్పాడు. అవి బంగారు వరహాల మూటలు.
ఒక్కొక్క మూటల్లోనూ పావువంతు చొప్పున వరహాలను తీసేసి ఎప్పటిలా మూటలను కట్టెసి భద్రపరిచాడు.
మరునాడు ఉదయం వ్యాపారస్థులు వెడుతూ తమ మూటలను అడగ్గా వారికి వాటిని అందిస్తూ “సరిగ్గా ఉన్నాయో లేదో లెక్క చూసుకోండి” అంటూ వారితో చెప్పాడు రాజశేఖరుడు.
అందుకు ఇద్దరు వ్యాపారస్థులు నవ్వుతూ "అయ్యా! మీరెంతో మంచివారు. రాత్రి మాకు ఆశ్రయమిచ్చారు. అడగగానే మా ధనాన్ని మీ ధనంగా భావించి రాత్రంతా భద్రపరచి తిరిగి అప్పగిస్తున్నారు. అలాంటి మిమ్మల్ని తప్పుపట్టగలమా?” అంటూ నవ్వి వెళ్ళిపోయారు.
ఇది జరిగిన కొన్నాళ్ళకి అనంతవర్మ మరణించాడు. అతడి మరణం వలన రాజశేఖరుడికి కోరినంత స్వేచ్ఛ లభించింది. డబ్బును విపరీతంగా ఖర్చు చేస్తూ అతి తక్కువ కాలంలోనే తండ్రి సంపాదించిపెట్టిన ఆస్తి మొత్తం పాడుచేసాడు. ఆ తర్వాత కొంత మంది మొహమాటస్థుల దగ్గర అప్పులు చేసాడు.
కొంత కాలానికి అతడికి చిల్లి గవ్వ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. అప్పటిదాకా అతన్ని అంటిపెట్టుకున్న స్నేహితులు ఒక్కొక్కరే మొహం తప్పించసాగారు.
రాజశేఖరుడికి ఏం చెయ్యాలో తోచలేదు.
ఒకనాడు మేనమామ వరసయ్యే బంధువు రాజశేఖరుడిని మందలించి రాయలు దగ్గరకు వెళ్ళి నీ తండ్రి చేసిన కొలువు నీకిమ్మని అడుగు అంటూ సలహా ఇచ్చాడు.
ఆ సలహా రాజశేఖరుడికి నచ్చింది -
కోశాధికారిగా తను కొలువు సంపాదిస్తే ఇక తనకి ధనానికి లోటు ఉండదని తలపోసాడు.
ఒకనాడు డాబుగా తయారయ్యి రాయలు దర్శనం చేసుకుని తను వచ్చిన పని విన్నవించుకున్నాడు.
రాయలు, మహామంత్రి తిమ్మరుసు రాజశేఖరుడి మాటలకు పగలబడి నవ్వారు. ఆ తర్వాత తిమ్మరుసు ఇలా చెప్పాడు-
"రాజశేఖరా! కొంత కాలం క్రితమే నీ తండ్రి తనకి చూపు మందగించిందని అందువల్ల తనని కొలువు నుంచి తప్పించి అది నీకివ్వవల సిందిగా కోరాడు. అప్పుడు మేమిద్దరం నిన్ను పరీక్షించాక నిర్ణయిస్తామని చెప్పాం.
నీకు గుర్తుందా ఒకరాత్రి వేళ ఇద్దరు వ్యాపారస్థులు మీ ఇంటికి వచ్చి నీకు రెండు వరహాల మూటలు ఇచ్చి భద్రపరచమన్నారు. అందులో నీవు పావు వంతు చొప్పున వరహాలను కాజేసావు.
ఆ వ్యాపారస్థులు ఎవరో తెలుసా? నేనూ, రాయలవారే. నీ నిజాయితీని పరీక్షిద్దామనే మేమిద్దరం మారువేషాల్లో మీ ఇంటికి వచ్చాం. నీ తండ్రి మొహం చూసి నీవు చేసిన దొంగతనానికి శిక్షించకుండా వదిలేసాం.
కోశాధిపతి అంటే ఎంతో నమ్మకస్థుడు, నిజాయితీ కలవాడు అయి ఉండాలి. నీ వంటి ఇంటిదొంగ ఆ పదవికి పనికి రాడు. నీ తండ్రి సంపాదించిన దానిలో పావువంతు మాత్రమే నీకు అందుబాటులో ఉంచి ముప్పావు వంతు రాయలు దగ్గర దాచాడు. ఇక నుండి నీవు ప్రతిరోజు కష్టపడి ఎంత ధనం సంపాదిస్తావో అంతే ధనం విజయనగర ఖజానాలో నీ తండ్రి భద్రపరచిన దాని నుండి పొందవచ్చు. ఇక వెళ్ళు” అంటూ తిమ్మరుసు చెప్పాడు.
రాజశేఖరుడు అవమానంతో తలదించుకుని వచ్చేసాడు. ఆనాటి నుండి అతడు చెడు అలవాట్లకు, స్నేహాలకు దూరంగా ఉంటూ తండ్రికి ఎరిగిన కొంత మంది వ్యాపారస్థుల దగ్గర పద్దులు రాయటం మొదలు పెట్టాడు.
కొంత కాలం తర్వాత మహామంత్రి తిమ్మరుసు రాజశేఖరుడిని స్వయంగా కలుసుకుని ఈ విధంగా చెప్పాడు.
"రాజశేఖరా! నీ తండ్రి, రాయలు, నేనూ నీలో కోరుకున్నది ఈ మార్పే. కష్టపడి మన తెలివితేటల్తో సంపాదించుకున్నదే మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నీ తండ్రి సంపాదించింది కనుక ఆ ధనాన్ని విపరీతంగా ఖర్చు చేసావు.
కానీ నువ్వు సంపాదిస్తున్న డబ్బును పొదుపుగా ఖర్చు చేస్తున్నావు. రాయలు ఖజానాలో ఉండే డబ్బు కూడా నీలా ప్రజలు కష్టపడి సంపాదించి పన్నుల రూపంలో కట్టినదే. అది తిరిగి ప్రజోపయోగకరమైన పనులకు ఖర్చు చెయ్యాలి. ఈ విషయం గుర్తుంచుకో. రేపటి నుంచి వచ్చి నీ తండ్రి చేసిన కొలువులో చేరు. నీతి నిజాయితీలే మనిషిని ఎప్పుడు వెన్నంటి ఉండే మిత్రులని తెలుసుకో”
ఆ మాటలకు రాజశేఖరుడు తిమ్మరుసు పాదాలకు నమస్కరించాడు. ఆ మర్నాడే రాయలు కొలువులో చేరి అతి తక్కువ కాలంలోనే సమర్ధుడైన కోశాధికారిగా పేరు తెచ్చుకున్నాడు.