ఒక ఊరిలో పేరయ్య అనే గొప్ప పిసినారి ఉండేవాడు-
అతడిని అందరూ పిసినారి పేరయ్య అనేవారు -
పేరయ్య దగ్గర బోలెడంత ధనమూ, బంగారమూ ఉంది. ఆ రెండింటి కంటే ఎక్కువ విలువైన ఒక వజ్రం కూడా ఉంది-
పేరయ్య అంత గొప్ప ధనవంతుడైనా ఇతరులకు వీసమెత్తు సాయం కూడా చేసేవాడు కాదు-
పేరయ్య భార్య మహా ఇల్లాలు -
తరచు భర్తను ఇలా మందలించేది-
“మనకి పిల్లా పీచు లేరు. చచ్చేనాడు ఇంత ధనం పట్టుకుపోతామా? ఉన్నదానిలో నలుగురికీ సాయం చేస్తూ నలుగురితో మంచిగా ఉంటే కష్టం వచ్చిన నాడు మనం పిలవకుండానే నలుగురూ వస్తారు”
ఈ మాటలు పేరయ్యకు రుచించేవి కావు. పైగా భార్యకు ఈ విధంగా తిరిగి సమాధానం చెప్పేవాడు-
"ఉన్నదంతా నలుగురికి ఊచ్చి పెడితే మనకి కావల్సిననాడు ఒక్కరు కూడా సాయం చెయ్యరు. మన ఖర్మ అని వదిలేస్తారు. పైగా కలిగినవాడు ఒళ్ళు మరచి పేదలకోసం దానధర్మాలు చేసామని ఎగతాళి చేస్తారు. అందుకనే మనం జాగ్రత్త చేసుకోవాలి. అయినా లక్ష్మి కోరి మన ఇంటికి వస్తుంటే ఆమెను మనమే పరాయి ఇంటికి పంపటం మూర్ఖత్వం అవుతుంది.”
కొన్నాళ్ళకి పేరయ్య భార్య మరణించింది-
పేరయ్య ఒంటరివాడయ్యాడు-
అతని బుద్ధి మాత్రం మారలేదు -
ఆ పరగణాలో గంగులు అనే పెద్ద గజదొంగ ఉండేవాడుగంగులు పేరుకి దొంగ అయినా దొంగిలించిన సొమ్మును వాడు పైసా కూడా ముట్టుకోకుండా పేదవారికి పంచేవాడు. అందుకని గంగులంటే పేదవారికి అభిమానం-
గంగులు కన్ను పేరయ్య ఇంటి మీద పడింది -
“వచ్చే అమావాస్యనాడు నీ ఇంటిని దోపిడి చేస్తాను” అంటూ లేఖను కట్టి బాణాన్ని ఓ రాత్రి పూట పేరయ్య తలుపుకు గుచ్చాడు. ఆ లేఖ చదివిన పేరయ్యకు కాళ్ళు చేతులు వణికాయి -
గంగులు సామాన్యుడు కాదు-
కొత్వాలు ఎన్నో సార్లు గంగుల్ని బంధించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. బంధించడం సంగతి సరే కనీసం వాడు ఎలా ఉంటాడో కూడా రాజుగారి గూఢచారులు కూడా కనిపెట్టలేకపోయారు.
గంగులు కన్ను పడిందంటే ఆ ఇల్లు గుల్ల అవుతుంది అన్న పేరుందిపేరయ్య బాగా ఆలోచించాడు-
అతడికో గొప్ప ఆలోచన కలిగింది-
వెంటనే
ఇంట్లో ధనాన్నంతా ఒక మూటగా-
బంగారాన్ని మరోమూటగా కట్టాడు-
రాత్రివేళ ఆ ధనాన్ని మొత్తం తీసుకుపోయి పెరట్లో గొయ్యి తీసి అందులో పాతిపెట్టి చేతులు దులుపుకున్నాడు-
పేరయ్యకి గొప్ప ధైర్యం వచ్చేసింది-
గంగులు వచ్చి ఇల్లంతా వెతికినా చిల్లిగవ్వ కూడా దొరకదు అనుకుని ఆ రాత్రి తృప్తిగా నిద్దుర పోయాడు-
ఆనాటి నుండి పేరయ్య ప్రతిరాత్రి వెళ్ళి గొయ్యి తవ్వి తను దాచిన మూటలు ఉన్నాయో? లేవా? అని చూసుకుని ఆ తర్వాత ఆ గొయ్యిని పూడ్చి వెళ్ళి నిద్దరపోయేవాడు-
కొంత కాలం గడిచింది-
అమావాస్య కూడా దాటి పోయింది -
ఇక గంగులు వల్ల భయం లేదన్న నమ్మకం కల్గింది పేరయ్యకు. రాత్రి ధనమంతా ఇంటిలోకి చేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ
అర్థరాత్రి వేళ యథావిధిగా ఆ గొయ్యిని తవ్వాడు. కానీ అందులో అతను దాచిన మూటలు కన్పించకపోవటంతో లబో దిబో మన్నాడు- పేరయ్య ఏడ్పు విని చుట్టు ప్రక్కల వారు వచ్చి జరిగింది తెలుసుకుని
పేరయ్య లాంటి పిసినారికి తగిన శాస్తి జరిగిందనుకున్నారు -
కొత్వాలు వచ్చి జరిగింది తెలుసుకుని 'పేరయ్యా! ఈ దొంగతనం గంగులే చేసి ఉంటాడు. వాడే కనుక చేస్తే ఆ సమాచారం లేఖలో రాసి ఆ చుట్టు ప్రక్కల ఎక్కడో వదిలే ఉంటాడు' అంటూ భటులను వెతకమన్నాడుభటులు దీపాలు పట్టుకుని వెతికి దానిమ్మ చెట్టు కొమ్మకు వేలాడగట్టిన
లేఖను తెచ్చి కొత్వాలుకు ఇచ్చారు -
ఆ లేఖలో గంగులు ఈ విధంగా రాసాడు-
"పేరయ్యా! నీ వంటి వాడి దగ్గర ధనం ఉన్నా లేనట్టే, అందుకనే దీన్ని తసుకుపోయి నిజంగా లేనివాళ్ళకు పంచుతాను. నువ్వు ధనం పోయిందని బాధపడకు రెండు గోతాముల్లో రాళ్ళు పోసి మూటకట్టి ఈ గోతిలో దాచుకుని దాన్నే నువ్వు పోగొట్టుకున్న ధనం అనుకో.... ఇతరులకు ఉపయోగపడే సంగతి అటుంచు. కనీసం నీకైనా ఉపయోగపడని నీ సంపద రాయితోనే సమానం కదా.”
కొత్వాలు బిగ్గరగా చదివి వినిపించటంతో చుట్టూ ఉన్న వారందరూ గంగులు చెప్పింది నిజమే కదా! అనుకున్నారు.
ఇతరులకు సాయం చేసే గుణం లేని వాడి దగ్గర ఉండే ధనం రాయితో సమానమన్నది నిజమే కదా.